మహా గాజు వంతెన పునఃప్రారంభం.. నో హై హీల్స్

28 Sep, 2016 16:43 IST|Sakshi
మహా గాజు వంతెన పునఃప్రారంభం.. నో హై హీల్స్

బీజింగ్: చైనాలో కొద్ది రోజులుగా మూతపడేసిన ప్రపంచంలోనే పొడవైన, అత్యంత ఎత్తయిన వేలాడే గాజు వంతెనను తిరిగి ప్రారంభించనుంది. ఈ నెల (సెప్టెంబర్ 30) నుంచి తిరిగి పర్యాటకులకు అనుమతించనుంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పలు మార్పులను, సూచనలను, హెచ్చరికలను నిర్వహణ సంస్థ ప్రవేశపెట్టింది.

ఈ బ్రిడ్జి వీక్షించాలనుకునే వారు ప్రత్యేకంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రర్ చేసుకోవడం ద్వారా ఒక గుర్తింపు పొంది.. దానిని స్వైప్ చేసి బ్రిడ్జిని చూసేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈసారి హై హీల్స్ ను అనుమతించడం లేదు. ఎలాంటి వ్యక్తిగత వస్తువులను కూడా ఈ వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. చైనాలోని జాంగ్జియాంగ్జి అనే ప్రాంతంలో గ్రాండ్ కానియన్ సెనిక్ ప్రాంతంపై ఈ వంతెనను నిర్మించారు. ప్రతి రోజు 8000మంది పర్యాటకులకు అనుమతించేలా దీనిని నిర్మించగా కానీ అనూహ్యంగా సందర్శకుల తాకిడి పది వేలకు పెరిగింది.

దాదాపు నెల రోజులపాటు ఈ వంతెనను మూసి వేసిన అధికారులు కొన్ని సాంకేతిక పరమైన మార్పులు చేయడమే కాకుండా ఆన్ లైన్ పరంగా కూడా మార్పులు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఈ వంతెనకు పలు మార్పులు చేశారు. 430 మీటర్ల పొడవుతో ఆరు మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించి దానిపై మూడు వేర్వేరు లేయర్లతో రూపొందించిన 99 దళసరి గాజు పలకలను అమర్చారు. డిజైన్ పరంగా, నిర్మాణ పరంగా ఈ వంతెన పది ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఈ వంతెనను సందర్శించేందుకు రూ.1400 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు