2012 కాదు, 2020లో యుగాంతం!

16 Jun, 2020 18:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2020 ఈ ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం గురించి ఎవరిని అడిగిన ఇలాంటి భయంకరమైన ఏడాదిని ఎప్పుడు చూడలేదనే చెబుతారు. ఈ ఏడాదిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్‌ దాడి, భూకంపాలు సంభవించి మానవ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే చాలా మంది 2020లోనే యుగాంతం కాబోతుందా? భూమి అంతరించిపోతుందా అని ఇంటర్‌నెట్‌లో తెగ వెతుకుతున్నారు. 

ఈ ఏడాదే యుగాంతం, త్వరలో భూమి అంతరించపోబోతుంది, అందరూ చనిపోతారు అంటూ ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే 2012 డిసెంబర్‌ 21న మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం భూమి అంతమవుతుందనే వాదన అప్పట్లో గట్టిగా వినిపించింది. దాని మీద ‘2012’ అనే పేరుతో హాలివుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాను కూడా తీశారు. అయితే 2012 వెళ్లిపోయి కూడా నేటికి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మనం 2020లో ఉన్నాం. అయితే మనం గ్రెగోరియన్ ​క్యాలండర్‌ను అనుసరిస్తున్నామని, మయాన్‌ క్యాలండర్‌ తప్పని శాస్త్రవేత్త, పండితుడు పాలో తగలోగుయిన్ ఒక ట్వీట్‌ చేశారు. దానిలో ‘జూలియన్ క్యాలెండర్ తరువాత, మనం సాంకేతికంగా 2012లో ఉన్నాం. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన రోజులు 11... 268కి గ్రెగెరియన్ క్యాలెండర్ (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని పేర్కొన్నాడు.                 

చదవండి:  (తూచ్‌.. యుగాంతం ఉత్తదే!)

దీనిని బట్టి చూస్తే జూలియన్ క్యాలెండర్ ప్రకారం టెక్నికల్ గా  మనం 2012లోనే  ఉన్నాం. జూలియన్ క్యాలెండర్ నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుంది. 1752 నుంచి 2020 వరకు అంటే 268 సంవత్సరాలు. సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి కాబట్టి 268ని 11తో గుణిస్తే  2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి, ఆ 2948ని 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క అని పాలో తగలోగుయిన్‌ వాదిస్తున్నారు. 

మయాన్‌ క్యాలెండర్‌లో 2012 గ్రెగోరియన్ క్యాలండర్‌లో 8 సంవత్సరాల తరువాత ఉంది. దీని ప్రకారం 2020 జూన్‌ 21న ఈ భూమి అంతం కానుందని పాలో తగలోగుయిన్‌ తెలిపారు. అయితే ఈ పోస్ట్‌ను వెంటనే ట్విటర్‌ తొలగించింది. అయినప్పటికి దీనిపై కొంత మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీని ఆధారంగా సోషల్‌మీడియా వేదికగా రకరకాల చర్చలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆధారం లేని వాదనలని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొట్టిపడేసింది. 

మరిన్ని వార్తలు