ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాయొచ్చు

9 Dec, 2018 02:33 IST|Sakshi

ఇప్పుడున్న కాగితాలు కొంత కాలానికి చిరిగిపోతాయి. వాటిపై రాతలు కొన్ని రోజులకే చెరిగిపోతాయి.  చైనా శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందుల్ని తప్పించే కొత్త రకం కాగితాన్ని తయారు చేశారు. ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. దీనిపై రాసింది 6 నెల్లదాకా చెక్కుచెదరదు. ఫ్యుజియన్‌ నార్మల్‌ వర్సిటీకి చెందిన లుజోహు చెన్‌ బృందం ఈ కాగితాన్ని తయారు చేసింది. ఈ కాగితం 3 పొరలుగా ఉంటుంది. ఒక వైపు పొరపై ప్రత్యేకంగా తయారు చేసిన నీలిరంగు పూస్తారు. వేడి తగలగానే ఆ రంగు మాయమై కాగితం తెల్లగా మారుతుంది.

రెండోవైపు నలుపు రంగు పూస్తారు. దీన్ని వెలుతురులో పెట్టినప్పుడు వేడిని పుట్టిస్తుంది. 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలో ఈ కాగితంపై నీలిరంగు వస్తూపోతూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఈ కాగితం తెల్లగా కనబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్‌ పది డిగ్రీల కంటే తక్కువుంటే కాగితం నీలిరంగుకు మారుతుంది.వేడిని పుట్టించే ప్రత్యేకమైన పెన్నుతో ఈ కాగితంపై రాయవచ్చు.ఈ కాగితంపై వందసార్లు రాసుకోవచ్చునని చెన్‌ చెబుతున్నారు. పెన్నుతో రాసింది చెరిగిపోవాలంటే కాగితాన్ని మైనస్‌ పది డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే చాలు. ఈ కొత్తరకం కాగితాన్ని అనేక సార్లు ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల కాగితం వినియోగం గణనీయంగా తగ్గుతుందని, ఫలితంగా కాగితం తయారీ కోసం చెట్లను నరకడం తగ్గుతుందని వారు వివరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు