సాయిలు రెవెన్యూ ఉద్యోగి కాదు

6 Jan, 2018 02:06 IST|Sakshi

ప్రమాదంలోనే మృతి

హత్య చేశారన్నది అవాస్తవం

కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం శివారులో బుధవారం రాత్రి మరణించిన బోయిని సాయిలు రెవెన్యూ ఉద్యోగి (వీఆర్‌ఏ) కాదని కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత స్పష్టం చేశా రు. ఆయనను ఎవరూ హత్య చేయలేదని, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని వివరించారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.

సాయిలు బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని ఉన్నాడని, ఆ సమయం లో ఇటుకలోడు దింపి ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్న డ్రైవర్‌ ఎర్ర అంబయ్య అతనిపై నుంచి వాహనాన్ని నడపడంతో మరణిం చాడన్నారు. వెంటనే డ్రైవర్‌  అక్కడి నుంచి ట్రాక్టర్‌తో పారిపోయాడని వివరించారు. అదే దారిగుండా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ సలీం, యజమాని మైస య్య, కూలీలు గంగాధర్, శ్రీను, సాయి, విజయ తదితరులు సాయిలు తలకు గాయమై చనిపోయినట్టు గమనించి ట్రాక్టర్‌ను వెనక్కు తిప్పుకుని వెళ్లారనన్నారు.

కాగా సాయిలు వీఆర్‌ఏ కాదని, సాయిలు  బాబాయి నారాయణ మార్తాండ గ్రామానికి వీఆర్‌ఏగా ఉన్నారన్నారు. కాకివాగు ఇసుక రీచ్‌ కాదన్నారు. రాళ్లతో కూడిన వాగని, దొడ్డు ఇసుక ఉంటుందన్నారు. సాయిలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఆయన భార్య సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారన్నారు. సాయిలును ఇసుక మాఫియా హత్య చేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. సాయిలు ఇంటి వద్ద గొడవపడి, మద్యం మత్తులో నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిం దని ఎస్పీ శ్వేత వివరించారు. నిందితుడు అంబయ్య లొంగిపోయాడన్నారు.  

మరిన్ని వార్తలు