మోహన్‌రెడ్డి కేసులో కీలక మలుపులు

10 Jan, 2018 06:49 IST|Sakshi

కరీంనగర్‌క్రైం: గతంలో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన మోహన్‌రెడ్డిపై తర్వాత ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. 9 నెలల క్రితం వరకూ సీఐడీ, ఇతర ఠాణాల్లో నమోదైన కేసులు కొలిక్కి వస్తున్నాయనుకున్న సమయంలో ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. దీంతోపాటు వెను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచీ మోహ న్‌రెడ్డి జైలులోనే ఉండిపోయాడు. ఏసీబీ కూడా బెయి ల్‌ రాకుండా పటిష్ట చర్యలూ తీసుకుంటోంది. దీంతో పాటు మోహన్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులకు చెంది న సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే కేసు విచారణ వేగం పెం చింది. దీంతో బాధితులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఏసీబీకి ఫిర్యాదులు అందిస్తున్నారు. విచా రణ చేపట్టి వెంటనే బినామీ పేరుతో ఉన్న ఆస్తులను బాధితులకు బదలాయింపు చేస్తుండడంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

మొదటి కేసు నమోదైన 26 నెలల తర్వాత బాధితులకు ఊరట లభిస్తుం డడంతో మళ్లీ కేసుల నమోదు పరంపర మొదలైంది. ఇప్పటికే 56 కేసులు నమోదయ్యాయి. తాజాగా.. సో మవారం ఐటీ టవర్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెం దిన కాంతాల స్వప్న తన ఫిర్యాదను అందించింది. ఆమెకు సంబంధించి 7.04 ఎకరాల భూమి ఉంది. డబ్బు అవసరం ఉండగా.. విషయం తెలుసుకున్న మోహన్‌రెడ్డి అనుచరులు రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, స్వరూపలు రంగంలోకి దిగారు. ఆమెకు రూ.5 లక్షల అప్పు ఇప్పించారు. తర్వాత ఎప్పటిలాగే తనఖా పెట్టిన భూమిని కబ్జా చేశారు. అయితే.. బాధితురాలు గతంలో సీఎం కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడంతో మోహన్‌రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారని తెలిసింది.

నాడు సీఐడీ పేర్కొన్న బినామీలు..
మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున బినామీలు ఉన్నారని సమాచారం. నాడు విచారణ సందర్భంగా పలువురు బినామీల పేర్లు బయటకొచ్చాయి. విశ్వనీయ సమాచారం మేరకు బినామీల్లో పుర్మ శ్రీధర్‌రెడ్డి, పుల్గం మల్లేశం, ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, బొబ్బల ఆదిరెడ్డి, బొబ్బల మహేందర్‌రెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, కొమటిరెడ్డి పద్మ, ఎస్‌.మహిపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, మేనేని సుమతీదేవి, కలకొండ ఆనందరావు, దేవులపల్లి మోహన్‌దాస్, ఇనుగంటి రామ్మోహన్‌రావు, చింతలపల్లి తిరుపతిరెడ్డి, సూరారం తిరుపతిరెడ్డి, కత్తి రమేశ్, అన్నాడి తిరుపతిరెడ్డి, బొబ్బల మమత, బొబ్బల లత, బొబ్బల రాంరెడ్డి, బొబ్బల నిర్మల, మంజుల, శ్యాంసుందర్‌రెడ్డి, కొల్లి మమత, నారాయణరెడ్డి, కుంట లలిత, కుంట రవీందర్‌రెడ్డి, కుంట రమణారెడ్డి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, జలేందర్‌రెడ్డి, తిప్పిరెడ్డి రాంరెడ్డి, బానాల రమణారెడ్డి, సూరారపు తిరుపతిరెడ్డి, నర్సింగం, సంపత్‌ శ్రీధర్‌రెడ్డి, బొబ్బల వజ్రమ్మ, సింగిరెడ్డి బాలకృష్ణరెడ్డి, సింగిరెడ్డి కమల, సింగిరెడ్డి రాజిరెడ్డి, నాగేంద్రచారి, బూరుగు రవీందర్‌రెడ్డి ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మందికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే.. తర్వాత ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగానే కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేసిందని బాధితులు ఆరోపించారు.

తాజాగా నమోదైన కేసులో..
కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని కమలాహైట్స్‌ ప్లాట్‌ నంబర్‌ 602కు చెందిన గుర్రం అమరేంద్రి అనే మహిళ కుటుంబç అవసరాల కోసం 2009లో మోహన్‌రెడ్డి వద్ద రూ.13 లక్షలు అప్పుగా తీసుకుంది. దీనికి గాను 7 ఖాళీ చెక్కులు, 6 ప్రామీసరి నోట్లు బాండ్‌ పేపర్స్‌పై సంతకాలు తీసుకున్నారు. మంకమ్మతోటలోని కోటి రూపాయల విలువైన ఇంటికి మోహన్‌రెడ్డి బినామీ అయిన బత్తిని తిరుపతిగౌడ్‌ పేరు మీద జీపీఏ చేయించారు. తర్వాత ఎనిమిది నెలల్లో రూ.8.32 లక్షలు చెల్లించారు. వడ్డీ కాకుండా మరో రూ.6 లక్షలు ఇచ్చారు. అయితే.. మరో 7 లక్షల రూపాయలు రావాలని.. వాటిని వెంటనే ఇవ్వాలని మోహన్‌రెడ్డి అనుచరులు భయబ్రాంతులకు గురిచేశారు. కాగా.. రెండు నెలల గడువు కోరారు. 2010 జూన్‌ 6వ తేదీన మోహన్‌రెడ్డి ధర్మారానికి చెందిన మాజీ నక్సలైట్‌ నర్సింగం వచ్చి తుపాకీతో బెదిరించారు. తర్వాత ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, పుర్మం శ్రీధర్‌రెడ్డి, పర్మిందర్‌సింగ్, పులుగం మల్లేశం, బొబ్బల మహేందర్‌రెడ్డి, పర్శరాములు, పూదర శ్రీనివాస్‌ వచ్చి ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తిరుపతిగౌడ్‌ ఆ ఇంటిని పింగలి అలియా అయిరెడ్డి శ్యామలాదేవికి అమ్మకం చేసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. కాగా.. అక్రమంగా తన ఇంటిని స్వాధీనం చేసుకుని.. తమకు తెలియకుండా అమ్మకాలు చేసిన వారందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ అమరేంద్రి శనివారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్‌గౌడ్‌ తెలిపారు.

మరో ఆస్తిని తిరిగిచ్చేశారు..
కరీంనగర్‌ మండలంలోని తీగలగుట్టపల్లి గ్రామంలో సంపత్‌రావు, సునిల్‌రావుకు చెందిన 6 గుంటల స్థలం ఉండేది. వారి అవసరం కోసం మోహన్‌రెడ్డి వద్ద 2014లో రూ.12 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించారు. అయినా భూమిని ఇవ్వకుండా దానిని బెజ్జంకి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే.. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రవీందర్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని మంగళవారం బాధితులకు తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా బాధితులు ఏసీబీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు