కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే

5 Jan, 2018 15:06 IST|Sakshi

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో దుర్గమ్మ నగలు దొంగతనం జరిగితే వాటి స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారు.. ఇపుడు ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని తెలిపారు. ఆ పూజలు మీ అనుమతి లేకుండా చేశారా.. ఎవరి కోసం చేశారో చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. తాంత్రిక పూజలపై దొంగే దొంగ అన్నట్లుగా ఉందంటూ ఈ పూజలపై విచారణ అంటున్న ప్రభుత్వం గతంలో వేసిన విచారణ కమిటీల నివేదికలపై తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు తెలపాలన్నారు. తాంత్రిక పూజలు భక్తులు మనోభావాలను దెబ్బతీశాయన్నారు. మీ విచారణల మీద ప్రజలకు నమ్మకం లేదని, అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్‌ చేశారు.

కాగా, గత నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ ఇపుడు జన్మభూమి నిర్వహిస్తున్నారు.. దీనివల్ల ఏ ఒక్కరికీ ఉపయోగం లేదన్నారు. జన్మభూమి, టీడీపీ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉపయోగించడం సబబుకాదన్నారు. పులివెందులలో మైక్ ఇవ్వకుండా చంద్రబాబు ఎంపీని అవమానించారన్నారు. ప్రైవేట్ వ్యక్తులు జన్మభూమి కార్యక్రమంలో ఎక్కవ కనిపిస్తున్నారని, పోలీస్ పహరాలోనే ఈ కార్యక్రమం జరుగుతోందని రఘువీరా విమర్శించారు.

మరిన్ని వార్తలు