పవన్‌ కళ్యాణ్‌ స్థలం అగ్రిమెంట్‌ రద్దు చేసుకోవాలి

6 Feb, 2018 12:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జలీల్‌

ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ జలీల్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు తీసుకున్న భూమి ముస్లిం మైనార్టీలదేనని పవన్‌ కళ్యాణ్‌ తరపు న్యాయవాదులు తేల్చిచెప్పారని ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు షేక్‌ జలీల్‌ అన్నారు. ఇకనైనా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ స్థలం లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని కోరారు. ఆక్రమించిన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించిన తనపై రౌడీషీట్‌ తెరిపించారన్నారు.

ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్‌ ముస్లిం మైనార్టీలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 15 రోజుల్లోగా లీజు అగ్రిమెంట్‌ రద్దు చేసుకోకపోతే జనసేన పార్టీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కబ్జా స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించే విషయాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి గుర్తింపు ఇవ్వవద్దని కోరతామన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు అహ్మద్‌బాషా, ఆరిఫ్‌బాషా, అన్సారీ బేగ్, ముస్తాక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు