‘రైతురథం’ పచ్చ చొక్కాలకే 

20 Jan, 2018 12:38 IST|Sakshi

అర్హులకు మొండిచేయి  

ప్రభుత్వంపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజం 

20 మంది రైతులకు ట్రాక్టర్లు అందజేత

సాక్షి, ఆదోని: వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్లు ఇచ్చే రైతు రథం పథకం  పచ్చచొక్కాలకే పరిమితమైందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు.  అర్హులైన రైతులు  దరఖాస్తులు చేసుకున్నా ట్రాక్టర్లు మంజూరు కావడం లేదన్నారు. ఈ విషయం పలువురు రైతులు తన దృష్టికి  తీసుకురావడంతో  ఒక్కో ట్రాక్టర్‌పై రూ. లక్ష సబ్సిడీతో  నియోజకవర్గంలోని 20 మందికి  ఇప్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా   అలసందగుత్తి గ్రామానికి చెందిన రైతు ఉరుకుందప్పకు ట్రాక్టర్‌ అందజేశారు. అన్నదాత ఆనందంగా ఉండటం కోసం  ఆ సబ్సిడీ మొత్తాన్ని ట్రాక్టర్‌ కంపెనీకి తానే చెల్లిస్తానన్నారు.  అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.  

రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పార్టీలకతీతంగా రైతు రథం కింద ట్రాక్టర్లు మంజూరు చేయాలని మంత్రులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో పార్టీలకతీతం సంక్షేమ పథకాలు మంజూరయ్యాయన్నారు. బాబు పాలనలో  ఆ పరిస్థితి లేదన్నారు.  కార్యక్రమంలో  ఎంపీటీసీ సభ్యుడు పెద్దయ్య, మాజీ సర్పంచ్‌ పెద్ద పెద్దయ్య, ఉప సర్పంచ్‌ బసరకోడు ఈరన్న, పెద్దయ్య, రైతులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు