పువ్వల్లే నవ్వుల్‌.. నవ్వుల్‌!

6 Feb, 2018 11:23 IST|Sakshi
హెల్మెట్‌ ధరించిన వ్యక్తికి రోజాపువ్వు ఇచ్చి అభినందిస్తున్న ఎస్పీ గోపినాథ్‌జట్టీ

రహదారి నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచన

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రహదారి నిబంధనలు పాటిస్తే వాహనచోదకులు కుటుంబ సభ్యులతో కలసి పువ్వులాగా నవ్వుకోవచ్చని జిల్లా ఎస్పీ గోసీనాథ్‌జట్టి సూచించారు. సోమవారం సాయంత్రం రాజ్‌విహార్‌లో వాహనదారులకు రహదారి నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ.. స్వయంగా హెల్మట్‌ ధరించిన ద్విచక్ర వాహనదారులు, షీటు బెల్టు పెట్టుకున్న ఫోర్‌వీలర్స్‌లకు రోజాపువ్వు, చాక్లెట్‌ ఇచ్చి అభినందించారు. ఇదే సమయంలో రహదారి భద్రత నియమాలను పాటించని వారికి మంత్రణం చేశారు.

అంతకముందు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ నుంచి రాజ్‌విహార్‌ వరకు రహదారి నియమాలను పాటించాలని భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాయన్నారు. హైవేల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలేదన్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి కుటుంబాలను వీధిపాలు చేసుకుంటన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు .డీఎస్పీలు ఖాదర్‌బాషా, సీఎం గంగయ్య, సీఐలు రామయ్యనాయుడు, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు