మోడల్‌ అంగన్‌వాడీ

19 Jan, 2018 08:19 IST|Sakshi

తంగెళ్లపల్లిలో చిన్నారులను ఆకట్టుకునేలా కేంద్రం నిర్మాణం

తరగతి గదిలోనూ పెయింటింగ్‌

ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల టౌన్‌: ఈ చిత్రాలు చూస్తుంటే ఏ పార్కులోని గది అనుకుంటారేమో.. కాదండి జడ్చర్ల మండలం తంగెళ్లపల్లిలో ప్రారంభమైన అంగన్‌వాడీ కేంద్రం అంటే విస్మయం కలుగుతుంది కదూ.. వాస్తవమే అంగన్‌వాడీ కేంద్రం అంటే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గదులు, పెంకుటిల్లు, స్కూల్‌ బిల్డింగ్‌లో అని ఊహించుకుంటాం. అందుకు విరుద్ధంగా గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టార. గతంలో బేస్‌మెంట్‌ వరకు నిర్మించి వదిలేసిన భవనాన్ని పూర్తి చేసేందుకు జెడ్పీ నిధులు రూ.3లక్షలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.3.5లక్షలతో పనులు ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు చైల్డ్‌ ఫ్రెండ్లీ పేరుతో కేంద్రానికి చిన్నారులను ఆకట్టుకునేందుకు పెయింటింగ్‌ వేయించారు. చోటాభీం చిత్రాలతోపాటు అక్షరమాల, శరీరంలోని భాగాలు, పండ్లు, పూల చిత్రాలు వాటి పేర్లు రాయించారు. మండలంలోని మాచారం, కిష్టారంలోనూ ఇలాంటి కేంద్రాలు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. గ్రామానికి వచ్చిన వారంతా అంగన్‌వాడీ కేంద్రాన్ని చూసి తమ ఊళ్లలోనూ ఇలా నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
చైల్డ్‌ ఫ్రెండ్లీ అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. చిన్నారులను ఆటాపాటలతో కేంద్రానికి వచ్చేలా చూడటానికే ఇలాంటి చైల్డ్‌ ఫ్రెండ్లీ కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో సీడీపీఓ మెహరున్నీసా, సర్పంచ్‌ రుకియాభాను, ఎంపీటీసీ చెన్నమ్మ, సూపర్‌వైజర్‌ రమణ, అంగన్‌వాడీ టీచర్‌ అనంతమ్మ, పీఆర్‌ డీఈ హీర్యానాయక్, ఏఈ అశ్వక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు