బిల్లులకు నిరీక్షణ

9 Feb, 2018 16:22 IST|Sakshi
ఊట్కూర్‌లో బిల్లులు అందని మరుగుదొడ్డి

అప్పులు చేసి మరుగుదొడ్ల నిర్మాణం 

నెలలు గడుస్తున్నా అందని బిల్లులు

ముందుకురాని కొత్త నిర్మాణ దారులు 

ఊట్కూర్‌ : మండలంలో మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లైయినా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.  మండలంలో నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో భాగంగా  ఆర్‌డబ్లూఎస్, ఈజీఎస్‌ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు.
  
638 మరుగుదొడ్లు మంజూరు
మండలంలో 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 508 మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ కారణాలతో 130 పెండింగ్‌లో వున్నాయి. ఊట్కూర్‌లో 102, పెద్దపొర్లలో 42, చిన్నపొర్లలో 22, అవుసలోనిపల్లిలో 44, ఎడివెళ్లిలో 20 తదితర గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు విడతల వారీగా ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9 వేలు వారి ఖాతాలో జమచేయాల్సివుంది.

200 మందికి అందని బిల్లులు    
రెండేళ్లు గడిచినా బిల్లులు రాలేదు. మం డలంలో దాదాపు 200 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సివుందని, అధికారులకు అడిగితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి బిల్లులు మంజూరు చేయాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు.

నిధులొస్తే ఇస్తాం 
లబ్ధిదారులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంతమందికి బిల్లులు రావాల్సి ఉందో ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా చూపడంలేదు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. బిల్లులు ఇప్పటికీ అందలేదు. విడుదలైతే లబ్ధిదారులు ఎందరో తెలుసుకొని వారి ఖాతాల్లో జమ చేస్తాం.  
– జయమ్మ, ఏపీఓ, ఊట్కూర్‌ 

18నెలలు గడిచింది 
మరుగుదొడ్డి నిర్మించి 18 నెలల అవుతుంది. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా ఉంది. సంబంధత అధికారులూ పట్టించుకోవడంలేదు. మా గ్రామంలో 20మందికి రావాల్సి ఉంది. అధికారులు వెంటనే బిల్లులు మంజూరుచేయాలి. 
– డీలర్‌ వెంకటయ్య, పెద్దపొర్ల, , ఊట్కూర్‌

మరిన్ని వార్తలు