ఆపన్నహస్తం అందించరూ!

22 Jan, 2018 08:17 IST|Sakshi

రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం..

ఆందోళనలో నిరుపేద కుటుంబం

వనపర్తి: ఈ మందులు వాడితే సులభంగా పొడవు పెరగవచ్చు అంటూ టీవీలో ప్రసారమయ్యే ఓ యాడ్‌ను చూసిన ఆ యువకుడు రూ.2 వేలు వెచ్చించి గ్రోత్‌ఆన్‌ అనే  మందుకొని వాడాడు. వారం రోజుల్లోనే.. శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. అలా రోజురోజుకు అనారోగ్యం పెరుగుతూనే వస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు సంస్థలు యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేసి సంస్థ ఉత్పత్తులను విక్రయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఖాజా నజీర్‌ అహ్మద్‌ ప్రస్తుతం అనుభవిస్తున్న నరకయాతనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంతో హుషారుగా ఉండే యువకుడు మూడుకాళ్ల వృద్ధుడిలా మంచానపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దిక్కుతోచని సంకట స్థితిలోకి జారిపోయింది.

గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అనారోగ్యం ప్రస్తుతం తీవ్రరూపం దాల్చింది. శరీరంలోని కండ పూర్తిగా కరిగిపోయి ధృడమైన శరీర సౌస్టంతో ఉండాల్సిన పద్దెనిమిదేళ్ల యువకుడు ఎముకలగూడతో పలికేందుకు సత్తువలేనంత నీరసంగా మారిపోయాడు. అస్వస్థత ప్రారంభంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా.. అక్కడి వైద్యులు పదిహేనురోజులపాటు వైద్యం అందించి పాలమూరులోని ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి మందులు ఉచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైదరాబాద్‌లోని మ్యాట్రిక్స్‌ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే.. ఆసరా పింఛన్, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే తల్లి కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్తులు పంచుకున్న బంధువులు ఆపద సమయంలో జాలి చూపించటం లేదు. పెద్ద మనస్సుతో సాయం చేసి నా కుమారుడి వైద్యం చేయించాలని తల్లి గోరీబీ, అక్క అర్షియా కోరుతున్నారు.

మరిన్ని వార్తలు