బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!

11 Aug, 2019 20:12 IST|Sakshi

ముంబై : రెండు అరటి పండ్లకు ఏకంగా రూ.443 బిల్లు వసూలు చేసి చంఢీగడ్‌లోని మారియట్‌ హోటల్‌ వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ ట్విటర్‌లో ఈ విషయం పంచుకోవడంతో ఎక్సైజ్‌-పన్నుల శాఖ స్పందించింది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపండ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. ఇక ఈ సంఘటన మరువక ముందే ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ ఘనకార్యం బయటపడింది.

రెండు కోడిగుడ్లకు సదరు హోటల్‌ ఏకంగా రూ.1700 వసూలు చేసిందని ‘ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌’ పుస్తక రచయిత కార్తీక్‌ దార్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘నిరసన వ్యక్తం చేద్దామా భాయ్‌..!’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ‘గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా’ అని ఒకరు.. ‘చికెన్‌ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా’అని మరొకరు కామెంట్‌ చేశారు. ఇక రెండు ఎగ్‌ ఆమ్లెట్‌లకు కలిపి ఫోర్‌ సీజన్స్‌ రూ.1700 బిల్‌ చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు