ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీ కనుమరుగు!
ఇతర పార్టీల్లోకి వరుస వలసలతో పార్టీ కుదేలు
నాలుగు నియోజకవర్గాల్లో లీడర్, కేడర్ కరువు
మిగిలిన ఒకరిద్దరూ కొనసాగేది అనుమానమే
సొంత శక్తితో టికెట్ను ఆశిస్తున్న కీలక నేతలు
జిల్లాలో సుమారు రెండు దశాబ్దాల పాటు బలమైన రాజకీయ శక్తి. సర్పంచ్లు, ఎంపీపీలు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఆ పార్టీ నేతలే రాజ్యమేలారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యూహంతో చావు దెబ్బ తగిలింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగైంది. ఇప్పుడా పార్టీకి లీడర్ లేడు.. కేడరూ లేదు.. మిగిలిందల్లా ఒకరిద్దరు సొంత బలం కలిగిన నేతలు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల నాటికి.. మిగిలిన ఆ ఒకరిద్దరూ పార్టీలో ఉంటారా..? వేరే దారి చూసుకుంటారా..? ఇదీ ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలిచింది. ప్రస్తుత సీఎం కేసీఆర్తో పాటు అనేక మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేక పదవులు దక్కించుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యూహంతో అసెంబ్లీ, పార్లమెంటులో జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక్కరికీ ప్రాతినిధ్యం దక్కలేదు.
క్షేత్ర స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 102 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో ప్రస్తుతం కేవలం పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్గౌడ్ మాత్రమే పార్టీలో మిగిలారు. జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పార్టీలో కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బట్టి జగపతి, శశికళ యాదవరెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు.
మిగిలింది ఒకరిద్దరు నేతలే!
ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సొంత శక్తి కలిగిన ఒకరిద్దరు నేతలే మిగిలారు. దశాబ్దకాలంగా పార్టీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్లోకి వలసలు సాగుతున్న నేపథ్యంలో.. సాధారణ ఎన్నికల నాటికి వీరిలో ఎవరు పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గుండు భూపేశ్ వ్యవహరిస్తుండగా, మాజీ కౌన్సిలర్ దరిపల్లి చంద్రం వంటి ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలేవీ నిర్వహించే పరిస్థితి లేదు.