పైన పటారం లోన లొటారం 

10 Feb, 2018 18:31 IST|Sakshi

పేరుకే రంగు రంగుల ఆసుపత్రి 

అధ్వానంగా ఆసుపత్రిలోని మూత్రశాలలు, నిరుపయోగంగా వాటర్‌ ఫిల్టర్లు 

ఆస్పత్రికి ఏడాదిలో రెండు సార్లు రంగులు వేసిన వైనం 

శామీర్‌పేట్‌ : సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలు కలిగిన మండలం... నూతనంగా ఏర్పడిన మేడ్చల్‌ జిల్లాకు శామీర్‌పేట మండలంలో నూతన కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణం... హైదరబాద్‌–కరీంనగర్‌ జాతీయ రహదారి... కనీసం వారంలో ఒక్క రోజైన తెలంగాణ ముఖ్య మంత్రి ప్రయాణించే మార్గం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మండలానికి ప్రాథమి క ఆరోగ్య కేంద్రం ఓ మచ్చలా కనబడుతోందని స్థానికులే అంటున్నా రు. ఎందుకంటే ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ అపరిశుభ్రత, వసతు లు లేమితో కనబడుతోంది.

శామీర్‌పేట మండల ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిలో రెండుసార్లు రంగులు వేశారు. ఆసుపత్రి బయటి నుంచి చూస్తే మాత్రం రంగులతో కళకళలాడుతోంది. కానీ ఆసుపత్రిలోని సౌకర్యాలు మాత్రం లేవు. రోగుల సౌకర్యార్థ ఏర్పాటు చేసిన మూత్రశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ఆసుపత్రి వెనక భాగంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాడైన మాత్రలు, పత్తి, ఇతర చెత్తను  ఆసుపత్రి ఆవరణలోనే పడేస్తున్నారు. ఆస్పత్రిలోని వాటర్‌ ప్లాంట్‌ పాడైపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నా ఏ అధికారి పట్టించుకున్న పాపానపోలేదు. 

రోగులతో దురుసుగా ప్రవర్తిస్తారు  
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నగరానికి చేరువలో ఉండటంలో మండలంలో వివిధ గ్రామాల ప్రజలే కాకుండా పక్క మండలాల ప్రజలూ వస్తుంటారు. ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనతో ఇక్కడికి వచ్చే రోగులు మానసికంగా కూడా బాధ పడుతున్నారు. ఈ తీరును వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మార్చుకోవాలి.    
– ఇర్రి రవీందర్‌రెడ్డి, జగన్‌గూడ గ్రామ ఎంపీటీసీ 

సీఎం హామీలు ప్రకటనలకే పరిమితం 
సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పక్క మండలమైన శామీర్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా ఉండటం బాధాకరం. ఇక్కడే ఇలా ఉందంటే రాష్ట్రం లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిధులు కేటాయించి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు మేల్కొని ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలి.      – వి.సుదర్శన్, కాంగ్రెస్‌ మండలం అధ్యక్షులు

గాంధీ ఆసుపత్రి అందించే సేవలు ఇక్కడా ఉండేవి 
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయింది. రాజీ వ్‌రహదారి పక్కనే ఈ ఆసుపత్రి ఉం డటంతో రోగులు అధిక సంఖ్య లో వస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మెరుగైన సేవలు అందించడానికి చొరవ తీసుకోవాలి. – కృష్ణయాదవ్, తూంకుంట గ్రామస్తుడు 

మరిన్ని వార్తలు