వందో సినిమా... ఆదిత్య 999

19 Jan, 2016 00:02 IST|Sakshi
వందో సినిమా... ఆదిత్య 999

 నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు సోమవారం  సమాధానం దొరికింది. హైదరాబాద్‌లో జరిగిన ‘డిక్టేటర్’ విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు. పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999’ తన వందో చిత్రమని తెలిపారు. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు. ఇప్పటికే స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

 హిట్ అని ముందే చెప్పా!
 శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ, అంజలి, సోనాల్‌చౌహాన్ ముఖ్యతారలుగా ఈరోస్ ఇంటర్నేషనల్, శ్రీవేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘డిక్టేటర్’ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనూ, శ్రీవాస్ దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒక్కటే. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడలేదు. అందుకే 15 కోట్ల తెలుగు ప్రజలు ఈ చిత్రాన్ని మెచ్చారు. ఈ సినిమా హిట్ అవుతుందని శ్రీవాస్‌కి ముందే చెప్పా’’ అన్నారు. ‘‘సినిమా విడుదలైన రోజే దాదాపు 900 ఫోన్లు రిసీవ్ చేసుకున్నా. అందరూ సూపర్‌హిట్ అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని శ్రీవాస్ అన్నారు. ఈ వేడుకలో  నటులు సుమన్, రాజీవ్ కనకాల, ఎడిటర్ గౌతంరాజు, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె.నాయుడు, రచయిత భాస్కరభట్ల, సోనాల్ చౌహాన్, నటి జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.