తారల చిందుకు కాసుల వర్షం

27 Dec, 2013 05:04 IST|Sakshi
గతంలో పండుగలు, ఇతర శుభకార్యాల్లో విందులు, వినోదాలు జరుపుకునేవారు. ఇప్పుడు సరదాలు, జల్సాలు, సంతోషాలకు ప్రత్యేక రోజేదైనా ఉందంటే అది డిసెంబర్ 31. కాస్మోపాలిటిక్ నగరాల్లో ధనవంతులకు, ధనం సంపాదించుకునే వారికి ఆ రోజు జాయ్‌ఫుల్ డేగా మారింది. ఆ రోజు రాత్రి నక్షత్ర హోటళ్లు, ఫామ్ హౌస్‌లు తారల బృందాలతో సం దడి నెలకొంటుంది. ఒక్క సినిమాకు లభించే పారితోషికం ఒక్కరోజే, అదీ కొన్ని గంటలు, కొన్ని నిమిషాలకే లభిస్తుండడంతో స్టార్ హీరోయిన్లు కూడా కాలుకదపడానికి సిద్ధం అవుతున్నారు. 
 
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా వంటి వాళ్లు కూడా చెన్నైలో స్టెప్స్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఇతర హీరోయిన్లు ఈ తరహా పార్టీలకు ఒక స్టార్ హోటల్ లో ఏడు నిమిషాల డ్యాన్స్‌కు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్‌లకు కూడా వెనుకాడని నటి ఛార్మి నగరంలోని ఒక నక్షత్ర హోటల్ లో డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈమెకు రూ.18 లక్షలు పారితోషికం చెల్లించడానికి ఆ హోటల్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
నటి శ్వేతా బసు రూ.7 లక్షల పారితోషికంతో మరో స్టార్ హోటల్‌లో చిందెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. గిండి సమీపంలోని ఒక హోటల్‌లో నటి స్నేహ, లక్ష్మీరాయ్, అనూయ తదితర తారలతోపాటు నటుడు శింబు, ఆర్య, ప్రసన్న, సంతానం కూడా సందడి చేయనున్నారు. ప్రముఖ నటీమణులు తమన్న, కాజల్ అగర్వాల్, అనుష్క, హన్సిక సమంతను కూడా ఆడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరు అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఏడాది డిసెంబర్ 31 హీరోయిన్లకు విందుతోపాటు గల్లా పెట్టెలు కూడా  నిండనున్నాయన్నమాట.
 
>