యస్... మహేశ్బాబు నలభై రోజుల పాటు అసెంబ్లీకి వెళతారు. అవును మరి.. రాజకీయ నాయకులు అసెంబ్లీకి వెళుతుంటారు కదా. పైగా, మహేశ్ ముఖ్యమంత్రి కూడా. ‘భరత్ అనే నేను’ గురించే చెబుతున్నాం అని ఈపాటికి అర్థమై ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ను ఇటీవల లక్నోలో జరిపారు.
నెక్ట్స్ షెడ్యూల్ను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ప్రారంభించనున్నారు. ఇది అసెంబ్లీ సెట్. దాదాపు 2 కోట్ల రూపాయలతో అచ్చంగా అసెంబ్లీని తలపించేట్లుగా ఈ సెట్ తయారు చేశారని చూసినవాళ్లు అంటున్నారు. ఇందులో 40 రోజుల పాటు షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘స్పైడర్’ చిత్రం చివరి పాట చిత్రీకరణ కోసం రుమేనియాలో ఉన్నారు మహేశ్. ఆ పాట పూర్తి కాగానే హైదరాబాద్లోని అసెంబ్లీలోకి అడుగుపెడతారు. అదేనండి.. ‘భరత్ అనే నేను’ సెట్స్లోకి ఎంటరవుతారు.