రోబోల ప్రేమ ఇరవై కోట్లు!

25 Nov, 2018 02:59 IST|Sakshi
అమీ జాక్సన్, రజనీకాంత్‌

20 కోట్ల బడ్జెట్‌ అంటే ఓ ఆరేడు చిన్న సినిమాలు తీయొచ్చు. కానీ ‘2.ఓ’ సినిమాలో ‘యంతర లోకపు సుందరివే’ సాంగ్‌ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. రెండు రోబోల మధ్య సాగే ఈ రొమాంటిక్‌ పాటకు బాస్కో మార్టిస్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘2.ఓ’, ‘ఐ’ సినిమాలకంటే ముందు ‘ఎందిరిన్‌’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు నేను శంకర్‌తో కలిసి వర్క్‌ చేయాల్సింది. కుదర్లేదు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమాకు శంకర్‌తో కలిసి వర్క్‌ చేశాను.

అందులో ‘పూలనే కునుకేయమంట’ అనే సాంగ్‌ను చైనాలో దాదాపు 30 రోజులు షూట్‌ చేశాం. ఇప్పుడు ‘2.ఓ’ సినిమాలోని ‘యంతర లోకపు...’ సాంగ్‌ను పది రోజులు షూట్‌ చేశాం. ఈ ఒక్క సాంగ్‌ కోసమే నాలుగు డిఫరెంట్‌ సెట్స్‌ను రూపొందించడం జరిగింది. విదేశాల నుంచి డ్యాన్సర్స్‌ను తెప్పించాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేసే సమయంలో మేజర్‌గా రెండు విషయాల గురించి ఆలోచించాం. ఒకటి.. రోబో జంట మధ్య రొమాంటిక్‌ ఫ్లేవర్‌ను స్క్రీన్‌ పైకి అద్భుతంగా  తీసుకురావడం, రెండు.. రజనీకాంత్‌గారి ఏజ్‌ అండ్‌ వాకింగ్‌ స్టైల్‌.

కానీ ఒక్కటంటే ఒక్క స్టెప్‌ను కూడా మార్చమని రజనీకాంత్‌సార్‌ చెప్పలేదు. రిహార్సల్స్‌లో చూపించిన ఎనర్జీనే సెట్‌లో రిపీట్‌ చేసి అందర్నీ ఆశ్యర్యపరచారు. అమీ జాక్సన్‌ కూడా డ్యాన్స్‌ అదరగొట్టింది. పెట్టిన ఖర్చుకు, వెచ్చించిన సమయానికి తగిన ఫలితం ఈ సాంగ్‌కు దక్కుతాయన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు