ఎట్టకేలకు రెడీ.. 2.0 రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసేశారు!

11 Jul, 2018 08:56 IST|Sakshi

ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న 2.0 సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్‌ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక‌్షన్స్‌, చిత్ర దర్శకుడు శంకర్‌ ఈ మేరకు ట్విటర్‌లో తెలిపారు.

రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ వంటి భారీ తారాగణంతో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను శంకర్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నా.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కారణంగా సినిమా అనుకున్న తేదీ విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్‌ వర్క్‌, వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిందని, కాబట్టి నవంబర్‌ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని శంకర్‌ ట్విటర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు