21 డేస్‌ లాక్‌డౌన్‌పై సినిమా

17 Apr, 2020 01:07 IST|Sakshi

లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన సంఘటనలకు కొన్ని కాల్పనిక అంశాలను జోడించి రూపొందనున్న చిత్రం ‘21 డేస్‌’. స్వీయదర్శకత్వంలో ఏఎమ్‌ విజయ్‌భాస్కర్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి విజయ్‌భాస్కర్‌ రాజ్‌ మాట్లాడుతూ – ‘‘మన దేశ ప్రధాని మోదీగారు 21 డేస్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు నాకు ఈ ‘21 డేస్‌’ సినిమా గురించిన ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఒక అబ్బాయి, ముంబై నుంచి ఒక అమ్మాయి చెన్నైలో చదవుకుంటుంటారు.

లాక్‌డౌన్‌ వల్ల ఈ క్లాస్‌మేట్స్‌ ఇద్దరు వారి వారి స్నేహితుల ఇళ్లలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే మా సినిమా కథాంశం. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ భయానక పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉండదు. ఇది కేవలం ఒక అవగాహన కోసం తీయబోయే సినిమాయే. కాబట్టి పెద్ద సమస్యలు రావనే భావిస్తున్నాను. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాను’’ అన్నారు.  నిర్మాతగా, దర్శకునిగా విజయ్‌కు ఈ ‘21 డేస్‌’ తొలి చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు