మార్పులు చేశాం – అయోధ్యకుమార్‌

28 Nov, 2018 00:42 IST|Sakshi

‘‘సినిమా ప్రమోషన్, పబ్లిసిటీ కోసం తప్పుదోవ పట్టలేదు. అసభ్యకరమైన సినిమాలు తీసి లబ్ధి పొందాలనుకునే ఫిల్మ్‌మేకర్‌ని కాను. ‘24 కిస్సెస్‌’ సినిమాను మా మదర్‌తో కలిసి చూశాను. కొందరు మహిళా మండలి సభ్యులు కూడా చూశారు. ఈ చిత్రం నా జీవితం ఆధారంగా తీసింది కాదు’’ అన్నారు దర్శకుడు అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి. అరుణ్‌ అదిత్, హెబ్బా పటేల్‌ జంటగా సీనియర్‌ నరేశ్, రావు రమేష్‌ కీలక పాత్రలు చేసిన చిత్రం ‘24 కిస్సెస్‌’. అయోధ్యకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. మంగళవారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో అయోధ్యకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఆడియన్స్‌ రిపోర్ట్స్, కలెక్షన్స్‌ బాగున్నాయి. సినిమా అందరికీ నచ్చిందని చెప్పడం లేదు.

రివ్యూస్‌ చదివాను. మల్టీఫుల్‌ లేయర్స్, స్లో నెరేషన్‌ ఉంది అంటున్నారు. నేనింతే మారను అనుకునేవాడినికాదు. పాజిటివ్‌ విషయాలను తీసుకున్నాను. ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి క్యూబ్‌లో పెట్టాం. చైల్డ్‌ యాక్టివిస్ట్‌కి చెందిన అందమైన ప్రేమకథా చిత్రం ఇది. ‘24కిస్సెస్‌’ కాన్సెప్ట్‌ ఏంటో సినిమా చూసినవారికి అర్థం అయ్యుంటుంది’’ అన్నారు. ‘‘ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువతరం కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఓ మంచి పాయింట్‌తో అయోధ్య కుమార్‌ మంచి లవ్‌స్టోరీ తీశారు. ఒక సినిమా రెవెన్యూనే సక్సెస్‌ అనుకుంటే ఈ సినిమా సక్సెస్‌ అయినట్లే. ఓ చైల్డ్‌ యాక్టివిస్ట్‌ ట్రావెలింగ్‌ లవ్‌స్టోరీని కిస్సెస్‌ల రూపంలో చూపించారు దర్శకులు’’ అన్నారు నరేశ్‌. ఈ సినిమాలో నటించిన శ్రీనివాస్‌ మాట్లాడారు. 

మరిన్ని వార్తలు