37 కార్లు... 5 ట్రక్కులు క్రాష్‌

22 May, 2018 01:22 IST|Sakshi

హెడ్డింగ్‌ చూసి ఇంత విధ్వంసం ఎక్కడ జరిగింది? అనుకుంటున్నారా? ‘సాహో’ షూటింగ్‌లో.  ప్రస్తుతం దుబాయ్‌లో ‘సాహో’ సినిమాకు సంబంధించిన చేజింగ్‌ సీక్వెన్స్‌ 90 కోట్ల ఖర్చుతో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చేజ్‌ కోసం సుమారు 37 కార్లు, 5 భారీ ట్రక్కులను షూటింగ్‌లో భాగంగా క్రాష్‌ చేశారట. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక.

ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ గురించి ‘యూఏఈ’ మీడియాతో చిత్రబృందం మాట్లాడుతూ –‘‘ఇలాంటి ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీద్దాం అనే ప్లాన్‌ ఉన్నప్పుడు హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ దగ్గరకు వెళ్లాం. దుబాయ్‌లో లొకేషన్స్‌ చూశాక కెన్నీ బేట్స్‌ యాక్షన్స్‌ సీన్స్‌లో ఎక్కువ పోర్షన్‌ రియలిస్టిక్‌గా షూట్‌ చేద్దాం అని డిసైడ్‌ అయ్యారు. ఆల్మోస్ట్‌ 90 శాతం స్క్రీన్‌ మీద చూపించేదంతా రియల్‌. ఇందులో చూపించే కార్లు, గాల్లో ఎగిరే కార్లు అన్నీ రియలే. జనరల్‌గా 70 శాతం సీజీ. 30 శాతం రియల్‌ ఉంటుంది. కానీ మేం వీలున్నంత వరకూ రియలిస్టిక్‌ సీన్స్‌ చూపించదలుచుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కెన్నీ బేట్స్‌తో పాటు మరికొందరు వరల్డ్‌ ఫేమస్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ కూడా ఈ చిత్రానికి పని చేయనున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌. ఎవలిన్‌ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ 2019లో థియేటర్లలోకి రానుంది.

>
మరిన్ని వార్తలు