ఆ రోజు బిగ్ ఫైట్ తప్పదా..?

8 Jul, 2017 11:49 IST|Sakshi

ప్రస్తుతం సినీ రంగంలోని అందరి దృష్టి ఆగస్టు 11 మీదే ఉంది. లాంగ్ వీకెండ్ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది స్టార్లు ఆగస్టు 11న తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కెరీర్లో కీలకమైన సినిమాలతో బరిలో దిగుతున్న నలుగురు హీరోలు ఒకేసారి బరిలో దిగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తే అందరికి నష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న జయ జానకి నాయక సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తేజ, రానాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోల కెరీర్కు చాలా కీలకం దీంతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు.

అదే సమయంలో మంచి ఫాంలో ఉన్న నితిన్ 'లై' సినిమాను ఆగస్టు 11నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అ..ఆ.. తో 50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ లైతో ఆ ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ప్రేమమ్, రారంబోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్ననాగచైతన్య కూడా యుద్ధం శరణం అంటూ అదే రోజు బరిలో దిగుతున్నాడు. మరి ఈ నలుగురు యువ కథానాయకుల్లో సక్సెస్ ఎవరి వరిస్తుందో చూడాలి.