8 నిమిషాలు.. 70 కోట్లు

14 Jun, 2018 00:06 IST|Sakshi

కాలం విలువైనది అని పెద్దలు చెబుతుంటారు. అవును ఎంత విలువైనది అంటే.. విలువైనదే కానీ కచ్చితంగా ఇంత అని చెప్పలేం. కానీ ‘సాహో’ చిత్రబృందాన్ని అడిగితే మాత్రం ఒక నిమిషం విలువ ఎనిమిదిన్నర కోట్లు. ఎనిమిది నిమిషాలు సుమారు 70 కోట్లు అంటున్నారు. బాబోయ్‌ అంతా! అంటే అవును మరి... కేవలం ఎనిమిది నిమిషాల యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం సుమారు 70 కోట్లు వెచ్చించారట ‘సాహో’ చిత్రబృందం. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీశారు. అయితే ఆ ఎపిసోడ్‌ లెంగ్త్‌ ‘ఎనిమిది నిమిషాలు’ అన్నది తాజా ఖబర్‌. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం దాదాపు వంద రోజులు ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరిపారట యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన కారుని కూడా ఉపయోగించారట కెన్నీ బేట్స్‌. సుమారు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 70 కోట్లు ఖర్చు చేసిందట చిత్రబృందం. ఈ భారీ యాక్షన్‌ కోసమే 28 కార్లు, 5 ట్రక్కులను క్రాష్‌ చేశారు. శంకర్‌ ఎహాసన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019 ప్రథమార్ధంలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు