నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!

1 Dec, 2019 09:12 IST|Sakshi

సాక్షి, చెన్నై : స్త్రీలు ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్భయంగా తిరిగే రోజు ఎప్పుడొస్తుందో అని నటి కీర్తీసురేశ్‌ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డిపై లైంగకదాడి, హత్య సంఘటనను అందరి మనసుల్ని కలచివేస్తోంది. ఒక్క తెలంగాణా ప్రజలే కాదు యావత్‌ భారత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని నడిరోడ్డులో కాల్చి చంపాలని, అదే వారికి సరైన శిక్ష అని ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. భాషా బేధం లేకుండా సినీ తారలు ప్రియాంకరెడ్డిపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలోనూ గాయనీ చిన్మయి లాంటి పలువురు ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటుడు విజయ్‌ అభిమానులు ప్రియాంకరెడ్డిపై లైంగికదాడి, హత్య వ్యవహారంపై పోరాటానికి సిద్ధమయ్యారు. దారుణంగా హత్యకు గురైన ప్రియాంక కోసం ఉయ్‌ డిమాండ్‌ జస్టిస్‌ ఫర్‌ అవర్‌ సిస్టర్స్‌ అంటూ  ఒక ట్యాగ్‌ను క్రియేట్‌ చేశారు.

దీన్ని మన సిస్టర్స్‌కు అంకితం అంటూ పేర్కొన్నారు. ఈ ట్యాగ్‌లో  ప్రియాంకరెడ్డి హత్య గురించి ప్రపంచానికి తెలిసేలా అందరూ తమ అభిప్రాయాలను పొందుపరచాలని కోరుతున్నారు. ఇప్పుడీ ట్యాగ్‌ ట్రెండింగ్‌ అవుతోంది. అదేవిధంగా యువ నటి కీర్తీసురేశ్‌ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంకరెడ్డి సంఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ సురక్షిత నగరంగా భావించిన హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇలాంటి దుర్ఘటనలపై ఎవరిని తప్పు పట్టాలో నాకు తెలియడం లేదు. స్త్రీలు ఎలాంటి సమయాల్లోనూ నిర్భయంగా తిరిగే దేశంగా మన దేశం ఎప్పుడు మారుతుందో..ప్రియాంకను హతమార్చిన ఈ కిరాతకులను వేటాడి శిక్ష పడేలా చేయాలి. హత్యకు గురైన ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నాను. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవడానికి ఆ భగవంతుడు తగిన శక్తిని ఇవ్యాలి. నేరస్తులు శిక్షించబడాలి. నాకు కర్మ ఫలంపై నమ్మకం ఉంది. అది నిరంతరం పని చేస్తుంది అని కీర్తీసురేశ్‌ పేర్కొంది.  

చదవండి: ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్‌

మరిన్ని వార్తలు