నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!

21 Jul, 2014 15:40 IST|Sakshi
నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది.  సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. 
 
మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. 
 
జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా..  కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.