ఆడపిల్లలే ఆస్తి

12 Mar, 2019 03:15 IST|Sakshi
రేణుక, ప్రసాద్‌ రెడ్డి

‘ఆడపిల్లని స్వాగతించండి.. వారిని సంరక్షించండి.. ఏ దేశానికైనా ఆడపిల్లలే నిజమైన ఆస్తి’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. ప్రసాద్‌ రెడ్డిని హీరోగా, రేణుకని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కళా రాజేష్‌ దర్శకత్వంలో వెంకటేశ్వర డిజిటల్‌ మూవీస్‌ పతాకంపై బండారు హరితేజ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కళా రాజేష్‌ మాట్లాడుతూ–‘‘నేడు ఆడపిల్ల అంటే పరపతి కోసమే అన్నట్లు చూస్తున్న కొంతమంది పురిటిలోనే చంపేస్తున్నారు. ఆడపిల్లల బర్త్‌ రేటు గణనీయంగా తగ్గుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే  సమాజానికి భవిష్యత్‌ అనేది ఉండదు.

విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నేను, నా మిత్రులు కలసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. నటుడు రవి ప్రకాష్‌ మాట్లాడుతూ– ‘‘నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్‌ పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్స్‌ బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత, యాక్టర్స్‌ అంతా కొత్తవారే అయినా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘మా తొలి ప్రయత్నం సక్సెస్‌ కావాలి.. సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు ప్రసాద్‌ రెడ్డి. కెమెరామెన్‌ షరీఫ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ నజీర్, వినోద్‌ రెడ్డి పాల్గొన్నారు. రాణిశ్రీ, నాగబాబు, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి, కెమెరా: వై.ప్రసాద్‌.

మరిన్ని వార్తలు