తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్

13 Mar, 2014 02:18 IST|Sakshi
తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్
 ఆ మధ్య క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎంత కలకలం సృష్టిం చిందో? ఎందరు క్రీడాకారులు అందులో ఇరుక్కుని తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారో తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వృత్తాంతం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ఇంతకు ముందు శివ హీరోగా తిల్లుముల్లు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు బద్రి తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఁఆడామే జయిచ్చమొడారూ. (ఆడకుండానే గెలిచామేరా) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ గత ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ అంశం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లో టోర్నమెంట్, బెట్టిం గ్స్, క్రికెటర్స్ ఇన్వాల్మెంట్ ఉన్న విషయం తెలిసిందేనన్నారు. 
 
 తాను తిల్లుముల్లు చిత్ర రూపకల్పనలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని చిత్రం చేయాలని అప్పడే నిర్ణయించుకున్నానన్నారు. నిజానికి ఈ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లు చాలా మందికి తెలియవన్నారు. వీటిని విపులీకరిస్తూ కమర్షియల్ అంశాలను జోడించి జనరంజక అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రమే ఆడామే జయిచ్చమొడా అని చెప్పారు. షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మే లో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం సమయంలో  చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు వివరిం చారు. యువ నటులు కరుణాకరన్, సింహా హీరోలుగా నటించిన ఈ చిత్రంలో చెన్నై-28 ఫేమ్ విజయలక్ష్మి హీరోయిన్‌గా నటించారని చెప్పారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఒక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రాధారవి  ముఖ్య పాత్రల్లో నటించారని తెలిపారు.