ఆదిని కొత్తగా ఆవిష్కరించే మరగద నాణయం

12 Dec, 2016 15:09 IST|Sakshi
ఆదిని కొత్తగా ఆవిష్కరించే మరగద నాణయం

యువ నటుడు ఆదిని కొత్త డైమన్సన్‌లో ఆవిష్కరించే చిత్రంగా మరగద నాణయం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్‌కే.శరవణన్ అంటున్నారు. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న చిత్రం మరగదనాణయం. ఆది కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు.ఇతర పాత్రల్లో ఆనంద్‌రాజ్, మునీష్‌కాంత్, కాళీవెంకట్, అరుణ్‌రాజ్ కామరాజ్, డానీ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైన్ గోపి నటిస్తున్నారు. దిబునినన్ థామస్ సంగీతాన్ని, పీవీ.శంకర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ ఇది ఎడ్వెంచర్, ఫాంటసీ, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

చిత్ర కథ, కథనాలు ఇంతకు ముందెప్పుడూ ప్రేక్షకులు చూడనటువంటివిగా ఉంటాయని తెలిపారు. నటుడు ఆది ఇంతకు ముందు యాక్షన్ కథా చిత్రాల్లో నటించినా, ఈ చిత్రం ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్న నిర్మాత ఢిల్లీబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.కథా బలం ఉన్న చిత్రాలనే నిర్మించాలన్నది యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ లక్ష్యం అని నిర్మాత తెలిపారు. 90 కథల్లో ఎంపిక చేసిన కథ ఇదని చెప్పారు. విభిన్న కథా చిత్రంలో నటిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని హీరో ఆది పేర్కొన్నారు.