నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా

22 May, 2020 11:17 IST|Sakshi

‘‘నేను అలియా సిద్ధిఖీ. నా గురించి నిజాలు చెప్పాలనుకుంటున్నాను. అపార్థాలకు తావివ్వదలచుకోలేదు. నిశ్శబ్దాన్ని దుర్వినియోగం చేసి.. అసత్యాలు ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదు’’అంటూ బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ భార్య అలియా తాను ట్విటర్‌ ఖాతా తెరిచిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తనకు ఎవరితోనూ అఫైర్‌ లేదని.. అలాంటి వదంతులకు చెక్‌ పెట్టేందుకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయినట్లు పేర్కొన్నారు. పెళ్లయిన తొలి ఏడాది నుంచే తమ కాపురంలో కలతలు చెలరేగాయంటూ భర్త కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన అలియా.. ఆయనకు విడాకుల నోటీసులు పంపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. (నవాజుద్దీన్‌ సిద్దిఖీకి విడాకుల నోటీసులు)

కాగా వయాకామ్‌ ఎగ్జిక్యూటివ్‌ పీయూష్‌ పాండేతో అలియా ప్రేమలో ఉన్నట్లు గతంలో రూమర్లు ప్రచారమయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం నవాజుద్దీన్‌ తన భార్య మీద డిటెక్టివ్‌లను నియమించాడన్న వార్త గుప్పుమంది. ఈ విషయంపై స్పందించిన అలియా.. వాటిని ఖండించింది. తన భర్త అలాంటి పనులు చేయడని.. వైవాహిక బంధంలో తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా భర్తకు ఆమె విడాకుల నోటీసుల పంపిన నేపథ్యంలో.. పీయూష్‌- అలియాల రిలేషన్‌షిప్‌ మరోసారి తెరమీదకు వచ్చింది.(అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా)

ఈ క్రమంలో బుధవారం ట్విటర్‌ అకౌంట్‌ తెరిచిన అలియా.. ‘‘నాకు ఎవరితో సంబంధం లేదు. తనతో నేను కలిసి ఉన్నట్లుగా ఫొటోను మీడియా సృష్టించింది. ప్రస్తుత పరిణామాలను పక్కదోవ పట్టించుకునేందుకు దానిని వినియోగిస్తోంది. అందుకే స్పష్టతనివ్వాలనుకుంటున్నాను’’అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. తన కోసం, తన పిల్లల క్షేమం కోసం దృఢంగా నిలబడేందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని.. ఎవరినో కాపాడేందుకు తన వ్యక్తిత్వాన్ని కించపరచడంలో అర్థం లేదంటూ మండిపడ్డారు. డబ్బుతో నిజాలను కొనలేరంటూ పరోక్షంగా భర్తను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  (విడాకుల కేసులో ఉత్తమ నటుడు)

మరిన్ని వార్తలు