పండగ ఎవరికి?

5 May, 2019 04:04 IST|Sakshi
హృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌

వచ్చే ఏడాది క్రిస్మస్‌కు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్‌ టాప్‌ హీరోలు ఆమిర్‌ఖాన్, హృతిక్‌ రోషన్‌. గత ఏడాది డిసెంబర్‌లో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్‌ ఖాన్‌. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్‌ తీసుకున్న ఆమిర్‌ ఖాన్‌ ఆస్కార్‌ అవార్డ్‌ సాధించిన హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’ హిందీ రీమేక్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ ఫేమ్‌ అద్వైత్‌ చందన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్‌ సమాచారం. ‘క్రిష్‌’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్‌ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కే విడుదల చేయనున్నట్లు హృతిక్‌ రోషన్‌ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఇద్దరు టాప్‌ హీరోలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్‌ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్‌ 4’ సెట్స్‌ పైకి వెళ్లలేదు. హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ కేన్సర్‌ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు