గేర్‌ మర్చాను

19 Aug, 2018 02:46 IST|Sakshi
పరుచూరి మురళి

‘‘ఇంతకు ముందు కమర్షియల్‌ సినిమాలు చేశాను. కానీ ‘ఆటగాళ్లు’ సినిమాతో గేర్‌ మార్చాను. కమర్షియల్‌ ఫార్మాట్‌కు ఈ సినిమా భిన్నమైనది. మంచి సినిమా తీశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తే చాలు. దర్శకునిగా నేను సక్సెస్‌ అయినట్లే’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. జగపతిబాబు, నారా రోహిత్‌ హీరోలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన సినిమా ‘ఆటగాళ్లు’. ‘గేమ్‌ విత్‌ లైఫ్‌’ అనేది ఉపశీర్షిక.

ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ– ‘‘పర్సనల్‌ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ను మైండ్‌ గేమ్‌తో ఇద్దరు హీరోలు ఎలా సాల్వ్‌ చేసుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ. ఇందులో జగపతిబాబు, నారా రోహిత్‌ ఇద్దరు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నారా రోహిత్‌ పాత్రకు ముందుగా ఏ హీరోనూ సంప్రదించలేదు. ఈ సినిమాలో రోహిత్‌ పాత్రకు జోడీగా దర్శనా బానిక్‌ కనిపిస్తారు. బెంగాల్‌లో ఆమె మంచి నటిగా పేరు సంపాదించారు. బ్రహ్మానందం, సుబ్బరాజు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మా ఫ్రెండ్స్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.

జనరల్‌గా లాభం ఆశించి నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. కానీ ఈ సినిమా నిర్మాతలు కథకు ఖర్చుపెట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు, నారా రోహిత్‌లలో ఎవరిని గెలిపించారు అంటే.. మంచిని గెలిపించాను. ప్రేక్షకులు మెచ్చే ప్రతిదీ మంచే’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా కంటే ముందు యూపీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కమర్షియల్‌ సినిమా చేద్దాం అనుకున్నా. కానీ నా బంధువు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఒకరు ‘ఆటగాళ్లు’ స్టోరీ లైన్‌ చెప్పాడు. చాలా ఎగై్జట్‌ అయ్యాను. నిర్మాతలకు కూడా కథ నచ్చడంతో సినిమా స్టార్ట్‌ చేశాం. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు మురళి.

మరిన్ని వార్తలు