సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్‌ దర్శకుడు

16 Jun, 2020 15:19 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌​ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంగనా రనౌత్‌ లాంటి హీరోయిన్లు బహిరంగంగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ పలు సంచలన ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్‌‌, అతడి కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ వేదికగా సుశాంత్‌ మృతికి సంతాపం తెలిపిన అభినవ్‌ కశ్యప్‌ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 2010లో సల్మాన్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దబాంగ్‌ చిత్రానికి అభినవ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సీక్వెల్‌కు కూడా అతనే దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అందుకు సల్మాన్‌ సోదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌లే కారణం అని అభినవ్‌ తెలిపారు. వారు తనిని బెదిరించడం ద్వారా సల్మాన్‌ సోదరులు తన కెరీర్‌ను నియంత్రించాడనికి ప్రయత్నించారని దబాంగ్‌ దర్శకుడు ఆరోపించారు. తాను అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తన భవిష్యత్తును నాశనం చేసి సల్మాన్‌ ఖాన్‌ కుటుంబం ప్రతీకారం తీర్చుకున్నదని తెలిపారు. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!)

2013లో అభినవ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేషారం’. ఇదే అతడి ఆఖరి చిత్రం. ఈ చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్‌, అతడి కుటుంబం అన్ని  రకాల ప్రయత్నాలు చేశారని అభినవ్‌ ఆరోపించాడు. ‘నా శత్రువులు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి గురించి అందరికి తెలియాలి. వారు సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్’‌ అని ఆరోపించారు. అంతేకాక వారు తనను బెదిరిస్తూ మెసేజ్‌లు కూడా చేశారని తెలిపాడు. ఈ సుదీర్ఘమైన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అభినవ్‌ టాలెంట్‌ మేనేజర్లు, ప్రొడక్షన్‌ హౌస్‌ల కుతంత్రాల గురించి వివరించారు. ‘వీరు తమ కంటూ ఓ కెరీర్‌ను ఏ‍ర్పర్చుకోరు. కానీ వారు మీ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తారు’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని తన పోస్టులో అభినవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. (ముసుగులు తొలగించండి)

మరిన్ని వార్తలు