ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి

27 Aug, 2014 01:49 IST|Sakshi
ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి

నటుడు ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కు ఎగబాకారు నటి అభినయ. పేరుకు తగ్గట్టుగానే ఈ ముగ్ధ మనోహరి అభినయంతో అభినందనలందుకుంటోంది. కాకపోతే చిన్న కొరత. ఈమె మూగ, బధిర అయినా వాటిని జీవితానికి బంధకాలుగా ఈ బ్యూటీ భావించలేదు. తన మైనస్‌ను ప్లస్ చేసుకుంటూ నటిగా ఎదుగుతున్నారు. తన లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నాడోడిగళ్ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన అభినయ తొలి చిత్రంతోనే అందరి హృదయాల్ని దోచుకున్నారు.
 
 అదే చిత్రం రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ తాజాగా బాలీవుడ్‌కు ఎగబాకడం విశేషం. బాలీవుడ్‌లో ధనుష్, అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్‌లు నటిస్తున్న క్రేజీ చిత్రం షమితాబ్. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె తండ్రి ఆనందవర్మ వెల్లడించారు. అభినయ సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారని చెప్పారు. తాజాగా హిందీలో షమితాబ్ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు.
 
 ఈ చిత్రం కోసం ఇటీవలే ఈ చిత్రం కోసం కొన్ని రోజులు పని చేశారని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్‌లో ధనుష్‌తో డ్యూయెట్ పాడటానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు తమిళంలో విశాల్ చిత్రం పూజై, జయం రవి చిత్రం తనీ ఒరువన్ లోను, పిరవి, మేళతాళం అనే మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు తెలిపారు. జయం రవి చిత్రంలో శాస్త్రవేత్తగాను, విశాల్ పూజై చిత్రంలో ఆయన మామకూతురుగాను నటిస్తున్నట్టు వివరించారు.