అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్‌’ రిలీజ్‌

17 May, 2019 13:21 IST|Sakshi

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్‌. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్షన్‌లో రమేష్ వర్మ నిర్మాణంలో డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. 

రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇటీవల సెవెన్ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాయి.

రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్.

ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు