ఒకేసారి... ఒకటికి... అయిదు!

27 Jul, 2016 22:46 IST|Sakshi
ఒకేసారి... ఒకటికి... అయిదు!

 ‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేశారీ సంస్థ అధినేత అభిషేక్. ఇప్పటికే ఫాంటమ్-రిలయన్స్ సంస్థలతో కలిసి అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న హిందీ ‘హంటర్’ తెలుగు రీమేక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది.
 
  ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నామని అభిషేక్ తెలిపారు. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరుస్తారు. రిషీ పంజాబీ కెమేరామ్యాన్‌గా వ్యవహరించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందించనున్న చిత్రం షూటింగ్‌ని కూడా ఇదే నెలలోనే ప్రారంభిస్తామని అభిషేక్ చెప్పారు.
 
  అడివి శేష్, అదా శర్మ జంటగా రవికాంత్  పేరేపు దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘గూఢచారి’ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుధీర్‌బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు.