మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

15 Aug, 2019 05:17 IST|Sakshi
అడివి శేష్‌

‘‘పాజిటివ్‌ క్యారెక్టరా? నెగటివ్‌ క్యారెక్టరా? అని కాదు. కథ బలంగా ఉండాలి. కథ నా పాత్ర చుట్టూ తిరగాలి. అలాంటి సినిమాలు చేయాలనుకుంటా’’ అన్నారు అడివి శేష్‌. వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో శేష్, రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అడివి శేష్‌ చెప్పిన విశేషాలు.

► ఈ సినిమాలో పదివేలు, ఇరవై వేలకు ఆశపడి తప్పులు చేసే విక్రమ్‌ వాసుదేవ్‌ అనే పోలీసాఫీసర్‌ పాత్రలో నటించాను. ఈ ‘ఎవరు’ చిత్రానికి హిందీ ‘బద్లా’తో ఏమైనా లింక్‌ ఉందా? అనే విషయం థియేటర్లోనే తెలుస్తుంది.

► ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు రామ్‌చరణ్‌ నాకు కంగ్రాట్స్‌ చెప్పారు. ట్రైలర్‌ నచ్చిందని రామ్‌చరణ్‌ అన్నారు. బెటర్‌మెంట్‌ చేశాం. రీషూట్‌ చేశాం. ఫైనల్‌గా సాలిడ్‌ స్టాండర్డ్స్‌కు సినిమాను తీసుకువచ్చాం. రీషూట్స్‌ చేయడం అనేది ‘క్షణం’ నుంచి నాకు అలవాటైందని అనుకుంటున్నా. మంచి అవుట్‌పుట్‌ రావడం కోసం మార్పులు చేయడంలో తప్పులేదన్నది నా అభిప్రాయం.

► థ్రిల్లర్‌ మూవీస్‌ను మళ్లీ చూడాలనిపించదు. ట్విస్ట్స్‌ తెలిసిపోయినప్పుడు రెండోసారి చూడాలనిపించదు. కానీ ఆ ట్విస్ట్‌లకు స్ట్రాంగ్‌ ఎమోషనల్‌ టచ్‌ ఉంటే మళ్లీ మళ్లీ చూడొచ్చు. ‘క్షణం’ అలాంటిదే. మా అమ్మగారు ఆ సినిమాను ఐదుసార్లు చూశారు.

► నా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌లో రచయిత అబ్బూరి రవిగారి పాత్ర ఉంది. అలాగే శోభు యార్లగడ్డగారి వల్ల ‘పంజా, బాహుబలి’ సినిమాల్లో నటించాను. నేను ఫ్లాప్‌ డైరెక్టర్ని. నా ‘కిస్‌’ సినిమా ఆడలేదు. పోస్టర్స్‌ అతికించే మైదాపిండి ఖర్చు కూడా రాలేదు. ‘క్షణం, గూఢచారి’ సినిమాల బడ్జెట్‌ విషయాల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యాను. ఆ సినిమాలకు కథ అందించింది నేనే. ‘మేజర్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ అప్పుడు మేజర్‌ అనౌన్స్‌మెంట్‌ అని ట్విట్టర్‌లో పెడితే, నా పెళ్లి వార్త అనుకున్నారు. కానీ అది ‘మేజర్‌’ సినిమా గురించి. ‘గూఢచారి 2’ స్టార్ట్‌ ఉంటుంది. నా కమిట్‌మెంట్స్‌ని చూసుకుని ‘2 స్టేట్స్‌’ రీమేక్‌ గురించి ఆలోచిస్తా.

మరిన్ని వార్తలు