అవును.. 20 ఏళ్ల తర్వాత విడిపోతున్నాం

28 May, 2018 09:40 IST|Sakshi
పిల్లలతో అర్జున్‌ రామ్‌పాల్‌ దంపతులు

సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ ఖాయమైపోయింది. నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌(45) తన భార్య మెహర్‌ జెసియా(47) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్లుగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావటం, జంటగా కనిపించి ఆ వార్తలను పటాపంచల్‌ చేస్తూ వచ్చారు . అయితే ఈసారి మాత్రం దానిని నిజం చేస్తూ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. 

‘20 ఏళ్ల అందమైన ప్రయాణం తర్వాత పరస్పర అంగీకారంతో మేం విడిపోవాలనుకుంటున్నాం. వీటి వెనుక కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. వేర్వేరు దారుల్లో వెళ్దామనుకుంటున్నాం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నప్పటికీ మాకు కావాల్సిన వాళ్ల కోసం మా మధ్య బంధం కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తన కంటే వయసులో పెద్ద అయిన మోడల్‌ మెహర్‌ జెసియాను 1998లో అర్జున్‌ వివాహం చేసుకున్నాడు.  వీరికి ఇద్దరు అమ్మాయిలు మహీకా(16), మైరా(13). 

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన అర్జున్‌ రామ్‌పాల్‌.. ప్యార్‌ ఇష్క్‌ ఔర్‌ మొహబ్బత్‌(2001) చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అర్జున్‌ రామ్‌పాల్‌.. దీవానపన్‌, ఆంఖే, దిల్‌ హై తుమ్హారా, దిల్‌ కా రిష్తా తదితర చిత్రాల్లో నటించారు. డాన్‌, ఓం శాంతి ఓం,  రాక్‌ ఆన్‌, హౌజ్‌ఫుల్‌, రాజ్‌నీతి, రా వన్‌, హీరోయిన్‌ చిత్రాల్లో అర్జున్‌ నటనకు మంచి పేరు దక్కింది. ఆ మధ్య డాడీ చిత్రంతో  ప్రేక్షకులను పలకరించిన అర్జున్‌ రామ్‌పాల్‌, పల్తాన్‌తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.        

మరిన్ని వార్తలు