సల్మాన్ ఖాన్ ఇంతవరకు స్పందించలేదు: నటుడు
ముంబై: బాలీవుడ్ నటుడు ఆశిష్ రాయ్(55) దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనను.. బిల్లు కట్టలేదన్న కారణంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న ఆశిష్ రాయ్.. పెద్ద మనసుతో తనను ఆదుకోవాల్సిందిగా అభిమానులు, సెలబ్రిటీలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా కొన్నిరోజుల క్రితం ఆశిష్ రాయ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల బిల్లు అయింది. అయితే ట్రీట్మెంట్ కొనసాగించడానికి సరిపడా డబ్బు లేదని చెప్పడంతో ఆయనను ఇటీవలే ఇంటికి పంపించారు.
ఈ విషయం గురించి ఆశిష్ రాయ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. పూర్తిగా బలహీనపడిపోయా. పనిమనిషి నా బాగోగులు చూసుకుంటున్నారు. నా సోదరి వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అప్పటిదాకా ఇబ్బంది తప్పదు. బిల్లు కట్టేందుకు డబ్బు లేకపోవడంతో మే 24న నన్ను డిశ్చార్జ్ చేశారు. డయాలసిస్ చేయించుకోవడానికి రోజుకు రూ. 2 వేల చొప్పున ఖర్చవుతుంది. రోజు విడిచి రోజు మూడు గంటల పాటు డయాలసిస్ నిర్వహిస్తారు. నా ఆర్థిక సహాయం కావాలి. నాకు చనిపోవాలని లేదు’’అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా ఆశిష్ రాయ్ గతంలో ఫేస్బుక్ వేదికగా సల్మాన్ ఖాన్ సాయం కోరిన సంగతి తెలిసిందే. అదే విధంగా అభిమానులు కూడా తమకు తోచిన సాయం చేయాలని అర్థించారు. (బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య)
సల్మాన్ స్పందించలేదు..
‘‘అసలు ఇంతకాలం బతుకుతానని అనుకోలేదు. డయాలసిస్ జరుగుతూ ఉంది. నాకు నేనుగా నడవగలుగుతున్నా. సల్మాన్ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. బహుశా ఆయనకు ఆ మెసేజ్ అందలేదేమో. ఏదేమైనా అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి నటన కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నా. కష్టకాలంలో నన్ను ఆదుకున్న వారి రుణం తీర్చుకుంటా’’ అని ఆశిష్ చెప్పుకొచ్చారు. కాగా పలు సినిమాల్లో నటించిన ఆశిష్ రాయ్.. బనేగీ అప్నీ బాత్, ససురాల్ సిమర్ కా, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ వంటి హిందీ హిట్ సీరియల్స్లో కనిపించారు.