బ్రహ్మానందం, జగపతిబాబులకు సాఫల్య పురస్కారం

5 Nov, 2017 21:53 IST|Sakshi

    ప్రదానం చేసిన ఢిల్లీ తెలుగు అకాడమీ 

     తెలుగువారు ఎక్కడున్నా ఐక్యంగా ఉండాలి: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సాక్షి, న్యూఢిల్లీ: హాస్యనటుడు బ్రహ్మానందం, నటుడు జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ తెలుగు అకాడమీ 29వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని మావలాంకర్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర సరస్వతి స్వామీజీ, అకాడమీ చైర్మన్‌ మోహన్‌ కందా తదితరులు బ్రహ్మానందానికి అవార్డును అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి జగపతిబాబు హాజరుకాలేకపోయారు.

అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కుడున్నా ఐక్యం గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాల వేడుకలు ఢిల్లీలో జరిగితే పెద్ద ఎత్తున హాజరవుతారని, అయితే తెలుగు ప్రజల్లో అది లోపించినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన వారిని గుర్తించి సత్కరిస్తున్న తెలుగు అకాడమీ కృషిని స్వరూపానందేంద్ర సరస్వతి అభినందించారు. పురస్కారాన్ని స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్టు బ్రహ్మానందం పేర్కొన్నారు. భాషను కాపాడితే జాతిని కాపాడినట్టేనని.. తెలుగు జాతి గొప్పదనాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు అందించాలని వ్యాఖ్యానించారు. అలాగే పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సినీరంగం నుంచి మురళీమో హన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, అలీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. సామాజిక సేవ విభాగంలో డాక్టర్‌ ఆర్‌.గురుప్రసాద్, విద్యారంగం నుంచి రావూరి వెంకటస్వామి, ఆర్థికశాఖ నుంచి వై.మహేశ్‌రెడ్డిలు పురస్కారాలు అందుకున్నారు.

వైద్యరంగంలో దశరథరామిరెడ్డికి..
సాక్షి, హైదరాబాద్‌: వైద్యరంగంలో యశోద ఆసుపత్రి చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ దశరథరామిరెడ్డిని ప్రతిభా భారతి పురస్కారం వరించింది. అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ముఖి, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలు దశరథరామి రెడ్డికి అవార్డు అందజేసి సత్కరించారు.

మరిన్ని వార్తలు