టాలీవుడ్‌ వైపు గౌతమి చూపు

25 Apr, 2017 02:00 IST|Sakshi
టాలీవుడ్‌ వైపు గౌతమి చూపు

దయామయుడు తెలుగు చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన అలనాటి అందాల తార గౌతమి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళం, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా నటించింది. అనంతరం సినిమాలకు దూరమైన గౌతమి లోకనాయకుడు కమల్‌ హాసన్‌తో కలిసి జీవించింది. ఆ సమయంలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే 13 ఏళ్లు కమల్‌హాసన్‌తో కలిసి జీవించిన గౌతమి ఆయన నుంచి విడిపోయిన తర్వాత సినిమాలపై పూర్తి దృష్టి సారించింది.

ప్రస్తుతం ఆమె విశ్వాసపూర్వం, మన్సూర్, ఈ వంటి మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇప్పుడు గౌతమి చూపు టాలీవుడ్‌పై పడింది. ఆమె తెలుగులో అధిక చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకుంది. మాతృ భాష తెలుగులో నటించడం కోసం పలువురు దర్శకుల వద్ద కథలు వింటోంది. అదే సమయంలో ఇతర భాషల్లో కూడా మంచి పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. మరి తెలుగు సినీ పరిశ్రమ ఆమెను ఆహ్వానిస్తుందో? లేదో? వేచి చూడాలి.