సినీ నటుడు ‘కోట’కు సత్కారం

19 Mar, 2015 23:58 IST|Sakshi

నాంపల్లి (హైదరాబాద్‌సిటీ) : కిన్నెర ఆర్ట్ థియేటర్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పద్మ పురస్కారం పొందిన ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులు అందించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మద్దూరు వెంకటేశ్వర యాజులు, ఈసీఐఎల్ చైర్మన్ పి.సుధాకర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీఎస్ రావు, పోల్కంపల్లి శాంతాదేవి, ప్రబల జానకి, కేఆర్ సుబ్రహ్మణ్యం, సీఎస్ రావు, కేవీ సత్యనారాయణ, కరూర్ వైశ్యాబ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.సుబ్రహ్మణ్యం, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, డాక్టర్ ఎర్రమిల్లి కృష్ణ, దాసరి వెంకట రమణ, కూర చిదంబరం, అక్కిరాజు జనార్దనరావులకు ఉగాది పురస్కారాలు అందించారు.

అనంతరం మద్దాళి ఉషా గాయత్రి శిష్యురాలు సౌందర్య కౌశిక్ కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.