జీవితం భలే మారిపోయింది

30 Aug, 2019 03:22 IST|Sakshi
మురళీ శర్మ

‘‘తొలిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేశా. అందరూ ఆయన్ని డార్లింగ్‌ డార్లింగ్‌ అంటారు. అలా ఎందుకంటారో ‘సాహో’ సినిమా చేసినప్పుడు తెలిసింది’’ అన్నారు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ జంటగా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘సాహో’ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో పోలీస్‌ పాత్ర చేసిన మురళీ శర్మ చెప్పిన విశేషాలు.

► ‘సాహో’ తొలిరోజు షూటింగ్‌ లంచ్‌టైమ్‌లో ‘ఇంటి భోజనం నాకు చాలా ఇష్టం’ అన్నాను. ఆ తర్వాత 60 రోజుల పాటు ప్రభాస్‌గారి ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. నాకే కాదు.. పదిమందికి సరిపడే పెద్ద క్యారియర్‌లో భోజనం వచ్చేది. గుత్తి వంకాయ కూర ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటల్లేవ్‌. నిజంగా ప్రభాస్‌ మంచి మనిషి.. యూనివర్సల్‌ డార్లింగ్‌.
 

► ‘భాగమతి’ సినిమా టైమ్‌లో సుజీత్‌ ‘సాహో’ కథ చెప్పాడు. తనది మంచి బ్రెయిన్‌. కథని అద్భుతంగా రాసుకున్నాడు. వంశీ, ప్రమోద్, విక్కీ చాలా ప్యాషనేట్‌ నిర్మాతలు. ఎప్పుడూ సెట్‌లో ఉండి సినిమా ఎలా వస్తోంది? ఏంటి? అని చూసుకునేవారు. యూవీ క్రియేషన్స్‌ నాకు హోమ్‌ బ్యానర్‌లాంటిది. ‘అభినేత్రి’ సినిమాకి మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పా. ఇప్పుడు ‘సాహో’కి కూడా. ఓ సినిమాని ఒకేసారి పలు భాషల్లో చేయడం, డబ్బింగ్‌ చెప్పడం ఓ ప్రయోగం. ఏ భాషలో అయినా భావోద్వేగాలు ఒక్కటే.. భాష మాత్రం వేరు.

► ఏ సక్సెస్‌కి అయినా ప్రిపరేషన్‌ ముఖ్యం. నా పాత్రకి ముందుగానే నేను ప్రిపేర్‌ అవుతా. ఇటీవల ‘ఎవరు, రణరంగం’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేశా. ప్రతి పాత్రనీ ఎంజాయ్‌ చేస్తా. తండ్రి పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత నా జీవితం మారిపోయింది.

► నేను పుట్టి, పెరిగింది ముంబైలో. మా అమ్మగారు తెలుగువారే. ‘అతిథి’ చిత్రంలో నాకు చాన్స్‌ వచ్చింది. బిగినింగ్‌లోనే మహేశ్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో, అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర చేస్తాననుకోలేదు. ‘మా అబ్బాయి కృష్ణగారి అబ్బాయి సినిమాలో చేస్తున్నాడు’ అని మా అమ్మ అందరికీ చెప్పుకున్నారు. తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ భాషలను మేనేజ్‌ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. మారుతిగారితో ఓ చిత్రం చేశా. సందీప్‌ కిషన్‌–నాగేశ్వర్‌రెడ్డిగారి సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ‘అతిథి’ తర్వాత మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశా.

మరిన్ని వార్తలు