మూడు చిత్రాలతో బిజీ!

26 Feb, 2015 23:27 IST|Sakshi
మూడు చిత్రాలతో బిజీ!

ఇప్పుడు రామ్‌కు క్షణం తీరిక లేదు. వరుసగా షూటింగ్‌ల మీద షూటింగులు. విశ్రాంతి గురించి కూడా ఆలోచించకుండా డేట్స్ కేటాయించేశారు. ఒకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ సినిమా చేస్తూనే, మరోవైపు రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపేశారు. జస్ట్ అంగీకరించడం మాత్రమే కాదు.. జెట్ వేగంతో ఓ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి ‘శివమ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ బుధవారంతో పూర్తయింది.
 
 శుక్రవారం రాత్రి ‘పండగ చేస్కో’ కోసం పోర్చుగల్, స్పెయిన్ ప్రయాణం అవుతున్నారు రామ్. వచ్చే నెల 23 వరకు అక్కడ ఉంటారు రామ్. ఇక్కడకు రాగానే, ‘శివమ్’ రెండో షెడ్యూల్ ఆరంభం అవుతుంది. ఆ వెంటనే శ్రీ స్రవంతి మూవీస్‌లోనే మరో చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కథ కూడా సిద్ధమైంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. అంటే... ఈ ఏడాది రామ్ మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నారన్నమాట.