మహానేత వైఎస్సార్‌కు శ్రీతేజ్‌ నివాళి

8 Jul, 2019 21:59 IST|Sakshi

సంచలనాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘లక్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ‘వంగవీటి’లో దేవినేను నెహ్రూ, క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్టీఆర్‌’  బయోపిక్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన నటుడు శ్రీతేజ్‌. ఈ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దివంగత మహానేత వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ..  శ్రీతేజ్‌ కొన్ని ఫోటోలు షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
‘ఎన్టీఆర్‌’బయోపిక్‌ సందర్భంగా వైఎస్సార్‌ పాత్రలో నటించిన శ్రీ తేజ్‌.. అప్పటి షూటింగ్‌ సమయంలో దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘ఒక్క సారి నేను ఆయన పాత్రలోకి ప్రవేశిస్తే నాకు వేరే ప్రపంచమే తెలియదు’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా బయోపిక్‌ కోసం వైఎస్సార్‌ పాత్రకు తనను ఎంపిక చేశాక ఆ మహానేతకు సంబంధించిన అనేక ఫోటోలను కలెక్ట్‌ చేశానని తెలిపారు.  షూటింగ్‌ సమయంలో వీలుచిక్కినప్పుడల్లా వైఎస్సార్‌లా ఉండేందుకు ప్రయత్నించేవాడినని తెలిపాడు. ఇక ప్రస్తుతం శ్రీతేజ్‌ హీరోగా నటించిన ‘అక్షర’  విడుదలకు సిద్దంగా ఉంది.

మరిన్ని వార్తలు