ఆర్‌ఎక్స్‌100ని మించి...

28 Sep, 2018 04:21 IST|Sakshi
ఆషిమా నర్వాల్‌, ఆశిష్‌ గాంధీ

‘‘నాటకం’ సినిమా కొంటున్నామని రిజ్వాన్‌గారు చెప్పారు. ఆ టైమ్‌లో వద్దన్నాను. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక నేను చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. ఆయన ఈ సినిమా కొన్నారంటేనే  ఎంత కంటెంట్‌ ఉందో అర్థమవుతుంది. ఆశిష్‌ గాంధీ నటన, సాయి కార్తీక్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ‘గరుడవేగ’ అంజిని ఇకపై ‘నాటకం’ అంజి అంటారు’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆశిష్‌ గాంధీ, ఆషిమా నర్వాల్‌ జంటగా  కల్యాణ్‌జి గోగన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’.

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ సాయిదీప్‌ చట్లా, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్‌ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కల్యాణ్‌జి గోగన మాట్లాడుతూ– ‘‘నాటకం’ సినిమాని ‘అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాలతో పోల్చడం గర్వంగా ఉంది. పదిహేను రోజుల్లో ఈ సినిమా కథ రాసుకున్నా. సింగిల్‌ సిట్టింగ్‌లో నిర్మాతలు ఓకే చేశారు. కథ చెప్పగానే సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని సాయి కార్తీక్‌గారు నమ్మారు’’ అన్నారు.

‘‘నాటకం’ సినిమాని ‘ఆర్‌ఎక్స్‌ 100’తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మా సినిమాని మించిన హిట్‌ అవ్వాలి’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘ఈరోజు  చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తి మా నాన్నగారు. నన్ను ఇంతగా సపోర్ట్‌ చేసిన ఆయనకు చాలా థ్యాంక్స్‌’’ అన్నారు ఆశిష్‌ గాంధీ. నిర్మాతలు రిజ్వాన్, ఖుషి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్, కెమెరామేన్‌ అంజి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు