తల్లిదండ్రుల గొప్పతనం చెబుతుంది

5 Apr, 2018 00:50 IST|Sakshi
సుమన్‌

‘‘సాధారణంగా పుట్టుకతోనే అనాథలుగా మిగిలేవారికి, పుట్టిన తర్వాత అనాథలుగా మారేవారికి సమాజంలో గుర్తింపు ఉండదు. అటువంటి వారిని పట్టించుకోకపోతే వారు నేరస్థులుగా మారే అవకాశం ఉంది. అనాథలకు సంబంధించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘సత్యగ్యాంగ్‌’’ అని సుమన్‌ అన్నారు. సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ ఖన్నా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సుమన్‌ మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. నేను అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పాత్రలో కనిపిస్తా.

ఈ చిత్రంలో అనాథలపై అద్భుతమైన సాంగ్‌ ఉంది. చంద్రబోస్‌గారు చక్కగా రాశారు. సాత్విక్‌కి హీరోగా మంచి భవిష్యత్‌ ఉంది’’ అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేస్తున్న మంచి పనులు, తెలంగాణ అభివృద్ధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఏదైనా చేయాలని ఆయన్ను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో నా మద్దతు ఉంటుంది. హోదా వద్దు స్పెషల్‌ ప్యాకేజ్‌ కావాలనుకున్న సమయంలో ప్రధాని మోదీగారితో చంద్రబాబు నాయుడుగారే మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అసలు.. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలియజేస్తేనే కదా? వారికి ప్రత్యేక హోదా కావాలో? ప్రత్యేక ప్యాకేజీ కావాలో? నిర్ణయం తీసుకునేది’’ అన్నారు సుమన్‌.

మరిన్ని వార్తలు