వైఎస్సార్‌లా సేవ చేయాలనుంది

26 May, 2018 09:08 IST|Sakshi

నటుడు సుమన్‌

కృష్ణరాజపురం: రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టమైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తాను అని ప్రముఖ నటుడు సుమన్‌ అన్నారు. శుక్రవారం బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని నల్ళూరహళ్ళిలో తన మిత్రుడు, వ్యాపారవేత్త కిరన్‌కుమార్‌రెడ్డి ఇంటికి సుమన్‌ వచ్చారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం నటన పైన ఉంది. తెలుగులో ఇప్పటికే సుమారు 99 సినిమాల్లో నటించాను. అన్ని భాషల్లో కలిపి మొత్తం 500 పైన సినిమాల్లో నటించాను. ఇప్పటివరకు నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటాను. ప్రముఖ రాజకీయ నాయకులు అయిన ఎన్టీఆర్, వైఎస్సార్‌లు అంటే నాకు చాలా అభిమానం.

వారు పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. నేనూ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలే చేయాలన్నదే నా లక్ష్యం.  తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రైతుల కోసం రాష్ట్రంలోప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగున్నాయి. అన్ని చోట్లా రైతుల కోసం ఇలాంటి పథకాలను అమలు చేయాలి’  అని చెప్పారు.  ప్రస్తుతం దేశానికి తృతీయ ఫ్రంట్‌ అవసరం చాలా ఉందని సుమాన్‌ అన్నారు. మొన్న తాను జేడీఎస్‌ అధినేత హెచ్‌.డి.దేవెగౌడ, సీఎం హెచ్‌.డి.కుమారస్వామిని కలిశానని తెలిపారు. ప్రస్తుతానికి తనకు ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆశ లేదని, మునుముందు తప్పకుండా పోటీ చేస్తానని, అది ఏ  పార్టీ నుంచి అనేది ఇప్పుడే తెలియదని చెప్పారు.

మరిన్ని వార్తలు