నవరసలో సూర్య

15 Jul, 2020 03:00 IST|Sakshi

హీరో సూర్య డిజిటల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమౌతోందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. మణిరత్నం నిర్మాణసంస్థ మదరాస్‌ టాకీస్‌లో ‘నవరస’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే ఆంథాలజీ (పలు కథలు) తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొమ్మిది కథలతో సాగే ఈ సిరీస్‌లో ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఒక కథలో సూర్య నటించబోతున్నారట. ఈ కథను దర్శకుడు జయేంద్ర తెరకెక్కించనున్నారని సమాచారం. 2011లో సిద్ధార్థ్‌ హీరోగా తెలుగు, తమిళంలో విడుదలైన ‘180’ చిత్రాన్ని జయేంద్ర డైరెక్ట్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, కార్తీక్‌ నరేన్, బీజోయ్‌ నంబియార్, నటులు అరవింద్‌ స్వామి, సిద్ధార్థ్‌ ఒక్కో కథను తెరకెక్కిస్తారని టాక్‌. ఇంకో రెండు కథలకు దర్శకులను ఎంపిక చేయాలట. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ‘నవసర’ షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు